• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
Swaadhyaayam

Swaadhyaayam

  • Home
  • Sthotras
    • Ganesha
    • Shiva
    • Surya
    • Navagraha
    • Vishnu
  • Astrology
    • Fundamentals
    • Marriage Compatibility
    • Muhurthas
  • Blog
  • Temples
  • Festivals

Archives for December 2025

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత

వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ పవిత్ర దినాన శ్రీ మహా విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా భక్తులు భూమిపై సుఖసంతోషాలను అనుభవిస్తారని, మరణానంతరం వైకుంఠ లోకంలో స్థానం పొందుతారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
పురాణ కథనాల ప్రకారం, వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోకానికి సంబంధించిన ప్రధాన ద్వారం తెరచి ఉంటుందని విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు?

వేద పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్న సమయంలో, పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిన వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును భక్తి భావంతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.

2025లో వైకుంఠ ఏకాదశి తేదీ

2025 డిసెంబర్ 30 ఉదయం 07:52 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 05:01 గంటలకు  తిథి  ముగుస్తుంది.

వైకుంఠ ఏకాదశి పూజా విధానం

ముక్కోటి ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. అనంతరం ఆవునేతితో దీపారాధన చేసి పవిత్ర వాతావరణాన్ని ఏర్పరచాలి. లక్ష్మీ–నారాయణ స్వామివారిని తులసి మాలలు, గంధ పుష్పాలతో అలంకరించి, శోడశోపచార విధానంలో భక్తిశ్రద్ధలతో పూజించాలి.

శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన చక్రపొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత బ్రాహ్మీ ముహూర్తం ముగిసేలోపు సమీప వైష్ణవాలయానికి వెళ్లి, ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణ స్వామివారి దర్శనం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది.
ఈ పవిత్ర దినాన నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే, ఆయన అనుగ్రహంతో సకల శుభాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మోక్షప్రదమని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా వివరిస్తోంది.

వైకుంఠ ఏకాదశి ఉపవాస విధానం

ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించే భక్తులకు శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో సకల విజయాలు లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం. ఏకాదశి నాడు అన్నం, పప్పుధాన్యాలు సేవించడం నిషిద్ధమని ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. అందువల్ల ఈ రోజంతా ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. సాయంత్రం చంద్రోదయానికి ముందే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే సేవిస్తే, ఏకాదశి వ్రత ఫలం సంపూర్ణంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు

Kanchipuram Temples

1. కామాక్షి అమ్మవారి దేవాలయం

Location: కామకోటి పీఠం రోడ్, కాంచీపురం

కామాక్షి అమ్మవారి దేవాలయం శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దేవి కమలాసనంపై శాంత స్వరూపంలో దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయానికి విశేష మహిమను చేకూర్చారని పురాణ విశ్వాసం. ఈ ఆలయం కాంచీపురం నగరానికి ఆధ్యాత్మిక కేంద్రం. నవరాత్రి, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విద్య, శాంతి, కుటుంబ సుఖం కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

2. ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం

Location : ఏకాంబరేశ్వర సన్నిధి వీధి, కాంచీపురం

ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పంచభూత క్షేత్రాలలో భూమి తత్వాన్ని సూచించే అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయం పల్లవ, చోళ, విజయనగర రాజవంశాల కాలంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రాచీన మామిడి చెట్టు సుమారు 3500 సంవత్సరాల పురాతనమని నమ్మకం. ఆలయంలోని భారీ గోపురం, వేల స్తంభాల మండపం శిల్పకళకు ప్రతీకలు. మహాశివరాత్రి, పంగుని ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

3. కైలాసనాథర్ దేవాలయం

Location : కైలాసనాథర్ కోయిల్ రోడ్, కాంచీపురం

కైలాసనాథర్ దేవాలయం కాంచీపురంలోని అతి పురాతన శివాలయాలలో ఒకటి. పల్లవ రాజు నరసింహవర్మన్ II 7వ శతాబ్దంలో దీనిని నిర్మించాడు. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు ఆదర్శంగా నిలుస్తుంది. గర్భగుడి చుట్టూ ఉన్న చిన్న శివాలయాలు ప్రత్యేక ఆకర్షణ. శిల్పాలలో పురాణ కథలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ప్రశాంత వాతావరణం కారణంగా ఆధ్యాత్మిక సాధనకు ఈ ఆలయం ఎంతో అనుకూలం.

4. వరదరాజ పెరుమాళ్ దేవాలయం

Location : చిన్న కాంచీపురం

వరదరాజ పెరుమాళ్ దేవాలయం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దివ్యదేశాలలో ఒకటి. చోళ మరియు విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం విస్తరించబడింది. ఇక్కడి అతి వరదరాజ స్వామి విగ్రహాన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దర్శనానికి ఉంచుతారు. ఆలయంలోని శిల్పాలు, మండపాలు అద్భుతంగా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవం సమయంలో లక్షలాది భక్తులు దర్శించుకుంటారు.

5. యథోక్తకారి (తిరువెక్కా) పెరుమాళ్ దేవాలయం

Location :  తిరువెక్కా, కాంచీపురం

యథోక్తకారి పెరుమాళ్ దేవాలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు శేషపన్నగంపై శయనించిన రూపంలో దర్శనమిస్తాడు. “యథోక్తకారి” అంటే భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడు అని అర్థం. ఆలయం ప్రశాంతమైన వాతావరణంతో ప్రసిద్ధి చెందింది. పురాతన తమిళ ఆల్వార్లు ఈ క్షేత్రాన్ని తమ పాశురాలలో స్తుతించారు.

6. ఉలగలంద పెరుమాళ్ దేవాలయం

Location : పెద్ద కాంచీపురం

ఈ ఆలయం విష్ణువు త్రివిక్రమ అవతారాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకే ప్రాంగణంలో నాలుగు దివ్యదేశాలు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. పల్లవుల కాలం నాటి నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలోని విస్తృత ప్రాకారాలు, ఎత్తైన గోపురం విశేష ఆకర్షణ. బ్రహ్మోత్సవాలు భక్తుల హృదయాలను అలరిస్తాయి.

7. చిత్రగుప్త స్వామి దేవాలయం

Location : నెల్లుకార వీధి, కాంచీపురం

చిత్రగుప్త స్వామికి అంకితమైన అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. మనిషి చేసిన కర్మల లెక్కలు నిర్వహించే దేవుడిగా చిత్రగుప్తుడు ప్రసిద్ధి. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం విశిష్ట శిల్పకళను కలిగి ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు విజయం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

8. త్రిలోకీనాథర్ దేవాలయం

Location : కాంచీపురం నగర ప్రాంతం

త్రిలోకీనాథర్ దేవాలయం శివుని త్రిలోకాల అధిపతిగా పూజిస్తుంది. ఇది తక్కువగా తెలిసినప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయం. శాంత వాతావరణం, సంప్రదాయ ఆచారాలు భక్తులను ఆకర్షిస్తాయి. స్థానికులు ఈ ఆలయాన్ని విశేష భక్తితో దర్శిస్తారు.

9. సత్యనాథేశ్వర స్వామి దేవాలయం

Location : కాంచీపురం దక్షిణ ప్రాంతం

సత్యనాథేశ్వర స్వామి దేవాలయం శివ భక్తులకు ప్రశాంతమైన క్షేత్రంగా పేరొందింది. పురాతన సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తారు. పెద్ద జనసందోహం లేకుండా శాంతిగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. స్థానికుల విశ్వాసంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.

10. అష్టభుజకరం పెరుమాళ్ దేవాలయం

Location : తూర్పు కాంచీపురం

ఈ ఆలయం ఎనిమిది భుజాలు కలిగిన విష్ణు స్వరూపానికి అంకితం. ఇది కూడా ఒక దివ్యదేశం. శిల్పకళ, ప్రశాంత వాతావరణం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు ఇక్కడ ధైర్యం, రక్షణ కోసం ప్రార్థనలు చేస్తారు. కాంచీపురం వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది

Ponthana

వధూవర వివాహ పొంతన  అంశములు

1. తారా బలము 13. కుజ దోషం
2. గణ పొంతన 14. ద్విద్వాదశం దోషం
3. మృగ వైరం 15. నవ పంచక దోషం
4. నాడి కూటమి 16. షష్టాష్టక దోషం
5. రజ్జు కూటమి 17. వధువు / వరుడు లగ్నాధిపతులు 
6. గుణ మేళన 18. వధువు / వరుడు సప్తమాధిపతులు
7. లగ్నాధిపతుల స్థితి 19. వధువు / వరుడు అష్టమాధిపతులు
8. సప్తమాధిపతుల స్థితి 20. వధువు / వరుడు చంద్ర బలం
9. రాశ్యాధిపతుల స్థితి 21. వధువు / వరుడు ద్వితీయ స్థానం
10. లగ్న కూటమి 22. వధువు / వరుడు ద్వితీయ స్థానం
11. చంద్ర స్థానం 23. వధువు / వరుడు ద్వితీయ స్థానం
12. కాల సర్ప దోషం 24. మాంగల్య బలము
25. తుది ఫలితము

Sreekaram

శ్రీకారమ్

श्री:

వివాహ పొంతన చూడడానికి వధూవర గుణమేళన పట్టిక నందు

ఎడమ వైపు వధువు (Bride) జన్మ వివరాలు

కుడివైపు వరుని (BrideGroom) జన్మ వివరాలు నింపవలెను

పరాశర పధ్ధతి అనుసరించే సాఫ్ట్వేర్ లో ఇద్దరి జాతకం వేసుకుని పట్టికలో నింపవలెను.

యీ  క్రింది ఉచిత మొబైల్ సాఫ్ట్వేర్ ఖచ్చితమైన జాతక  గణన చేస్తుంది.

Astrology & Horoscope

యీ ప్రాధమిక సమాచారం నింపిన తరువాత ఒక్కొక్క అంశం

ఎలా చూడాలో వివరం తెలుసు కుందాము.

మిరాశీదారు అపరాధం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

మహాస్వామి వారు ఆరోజుల్లో కంచిలో బసచేసి వున్నారు. మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయం. కుంభకోణం సమీపంలోవున్న తిరువిడైమరుదూరు మహాలింగ స్వామికి చైత్ర పౌర్ణమినాడు 11 మంది ఘనపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం శ్రీవారికి సమర్పించాలని ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు (భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు.

మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొని వచ్చాడాయన. ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగా వుంది.మిరాశీదారు వంతు వచ్చింది.మహాస్వామివారియందు అమితమైన భక్తి తాత్పర్యములు కలవాడాయన.స్వామివారిని చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు కనుబొమలెత్తి వారిని చూసి “ఏమి సమాచారం” అన్నారు, ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు తట్టలో విభూతి, చందనము,కుంకుమ, బిల్వపత్రములు,కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు.ప్రసాదమనగానే ముందుకు వంగి గ్రహించే స్వామి “ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?” అని ప్రశ్నించారు. స్వామీ!తిరువిడై మరుదూరు మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను అన్నాడు మిరాశీ దారు.

స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు పరీక్షగాచూసి “నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా పోగు చేశావా?”అన్నారు. లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను, అన్నాడు నేనే అన్న పదాన్ని వత్తుతూ. రుద్రభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?అన్నారు స్వామివారు. రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు, జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు. అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు.అయితే నువ్వు ఆత్మార్ధంగానో,లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న మాట”, అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలో పడిపోయారు స్వామివారు. 

కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారినిచూస్తే జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. “సరే,ఎంతమంది వేదపండితులు వచ్చారు?” అన్నారు స్వామి.మిరాశీదారు “11 మంది” అన్నాడు. “నీవే నిర్వహించావుకదా! వారెవరు?ఏగ్రామానికి చెందినవారు?” అన్నారు స్వామి. అక్కడున్న భక్తులకు స్వామి వారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో అర్ధం కాలేదు.మిరాశి దారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. “ఓహో!అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారు వున్నారేమో చూడు”. అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. “భేష్! భేష్! -వేంకటేశ ఘనాపాఠి గారు కూడా వున్నారన్నమాట.మంచిది. ఆయన చాలా పెద్దవిద్వాంసులు. మంచి వేద పండితులు. పెద్దవారయి పోయారు.రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు.” స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు “మీరు సరిగ్గా చెప్పారు స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది.ఎందుకు పిలిచానా అనుకున్నాను”.అన్నాడు. స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. 

“మనదగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదాఅని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా నోరు మూసుకుని కూరుచుంటే ఎలా? అని అన్నావా లేదా చెప్పు” అన్నారు తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా అయిపోయింది.

భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు.క్షణంవరకు సాధారణంగా మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నుల నుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద చేయి అడ్డు పెట్టుకుని, “నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి గారి తో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ!క్షమించండి” అంటూ ప్రాధేయపడ్డాడు.

ఆగు! అంతటితో ఆపలేదు.ఇంకాఉంది. నువ్వు పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత  ఇచ్చావు?” అన్నరు. “ఒక్కక్కరికీ 10 రూపాయలు ఇచ్చాను”. నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు.అందరికీ 10 రూపాయల చొప్పున ఇచ్చావా?” రెట్టించారు స్వామివారు.మిరాశీదారు మౌనంగాఉన్నాడు.స్వామి వదిలేటట్లు లేరు. “చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10రూపాయలు చొప్పున ఇచ్చావు.తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్ఛానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు.నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు. ఇది నిజమేనా?” అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య పోయారు.

[ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు ఉంటారట. వారి గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు చేస్తుంటే “జాగ్రత్త!సరిగ్గాపారాయణ చెయ్యి.మహాస్వామి వారున్నారు”.అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.]

మిరాశీదారు నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల ఇటువంటి తప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు.కన్నీరుమున్నీరుగా అవుతున్నాడు.స్వామి వారు ఆగేటట్లు లేరు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో? “ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ!అందరికి నీవే స్వయంగా వడ్డించావు.చక్రపొంగలి అమృతంలా ఉన్నది.మంచి నెయ్యి ఓడుతూ ఉంది.ఆనేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే స్వయంగా వడ్డించావు కదూ!”అన్నారు స్వామివారు.

తాను చేసిన ఒక మంచిపని శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, “అవును స్వామీ! నేనే స్వయంగా వడ్డించాను”. అన్నాడు. వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?” అని ప్రశ్నించారు స్వామి.

మిరాశీదారు నుంచి సమాధానం లేదు. సరే నీకు నేను చెప్తాను. చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరల మరల మారు వడ్డనకై అడిగారు. నీవుకూడా ఆనందంతో వడ్డించావు. కాని తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మారు అడిగితే,ఒకసారి కాదు అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా?ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమనించావు”. మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కన్పిస్తున్నారు.

మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ నిలుచున్నాడు. మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు.మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ కూర్చున్నారు. కనులుతెరచి సూటిగా చూస్తూ”మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81ఏళ్ళు.వారు తన పదహారేళ్ళ ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోనూ,వారిఊపిరిలోనూ వ్యాపించింది.వారు మహాపురుషులు. వారి యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు.” 

మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు.కొంచెంసేపు ఆగి మరలా కొనసాగించారు. నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది. నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు.నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికిపోయారు.మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని ఏమి ప్రార్ధించారో తెలుసా?” మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది.కొంతసేపయినతరువాత కొనసాగించారు.

కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, “అయ్యా! జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు.ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి ….. ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి, మరికొంచెం వడ్డించమని అర్ధిస్తున్నాను. ఒకసారికాదు….అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. 

కానీ స్వామీ! తరువాత నాకీ విధమైన చాపల్యం – అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను.అందుకే ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైనది పండు, కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు.”అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా”?మహాలింగ స్వామి నీచెయిదాలను ఒప్పుకుంటారా?”

మహాస్వామి వారు మౌనం వహించారు. మూడు గంటలయింది.పరిచారకులు భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు. ప్రతివారి కనులనిండా నీరు.

మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు. అయినా ప్రయత్నంమీద”స్వామీ! నా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని  చెప్పండి.మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను.స్వామీ!” క్షమించండి.మహాలింగస్వామి ప్రసాదం తీసుకోండి. నన్ను క్షమించండి.” అంటున్నాడు. స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు.

కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం పంపుతాడు”. అన్నారు. అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. “స్వామీ! నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరుదూరు అర్చకుడను.నిన్న మహాలింగస్వామికి శ్రీరుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు శ్రీవారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను”. అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు “శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు నమస్కరించరాదు”అంటూ వారించి, ప్రసాదం ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ మిరాశీదారును చూచి “ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది” అని చెప్పి వెళ్ళిపోయాడు.

మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు మళ్ళీ మళ్ళీ  ప్రాధేయ పడినాడు. మహాస్వామివారు లేస్తూ, “ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను. తేప్పెరుమానల్లూరు వేంకటేశ ఘనపాఠి మాత్రమే చెప్పగలరు” అన్నారు. ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశిత్తం చెబుతాడా” అన్నాడు మిరాశీదారు. నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు” అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు స్వామివారు.రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు.

మిరాశీదారు నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు.అక్కడకు చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివ సాయుజ్యమొందారు. స్వామివారు “నీకు ప్రాప్తముంటే” అన్న మాటల అర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు. వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు.

ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు.

శ్రీ మహాపెరియవ శరణం
ఓం నమో పార్వతి పరమేశ్వర హరహర మహాదేవ శంకర రక్ష రక్ష

జయ జయ శంకర | హర హర శంకర

Primary Sidebar

Recent Posts

  • శ్రీమద్వాల్మీకి సంక్షిప్తరామాయణము – బాలకాండ – ద్వితీయ సర్గ
  • సౌందర్యలహరి – శ్లోకం 3
  • శ్రీమద్వాల్మీకి సంక్షిప్తరామాయణము – బాలకాండము 
  • శ్రీమద్వాల్మీకి సంక్షిప్తరామాయణము
  • సౌందర్యలహరి – శ్లోకం 1

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025

Categories

  • Balakanda
  • Blog
  • Festivals
  • Soundaryalahari
  • Srimadramayanam
  • Srimata
  • Sthotras
  • Vishnu Sthotras

Copyright © 2026 · Swaadhyaayam